Friday, July 24, 2009

నాకూ మరణం కావాలి !!


మెరిపించిన కనులను
పెదవి విరుపులు
మరుగుచేస్తున్నాయి..
ఐనా.. ఈ తావు వీడలేను


నేను..
నిశీధిలో కలిసిన
మూగ నవ్వును ..
తడి స్పర్శ తెలియని
తపన జీవిని ..
ఏ గంధమూ లేని
మనసుగంధాన్ని..

రాలిన ప్రతి పువ్వూ
విధి విదిల్చిన రంగువే
అంటూ దెప్పుతుంది.
చివుక్కుమన్న ప్రాణం
చిన్నబోతుంది.

మంచు ముత్యాలూ
తేనెటీగలూ
కొప్పు శిఖరాలూ
కోవెల మెట్లూ
అన్నీ నా కలల ప్రపంచంలో ..
కరగని కధలే..

అలంకారానికీ కొరగాక
ఆనందాలకూ పనికిరాక
చావుకీ దూరంగా
ఎందుకీ బ్రతుకు? ఎవరికోసం.

ఆ నవ్వు.. ఆ స్పర్శ..
ఆ మమత.. ఆ ఆనందం..
నాకూ కావాలి.

మరుజన్మ కైనా.. కానీ
ప్స్చ్‌ .. మరణమూ రాదుగా.
కాగితం పువ్వును నేను..
ఈ బ్రతుకింతే !!

త్రినాధ్ గారు తన బ్లాగులో ఆంగ్లంలో రాసిన కవిత నుండి స్పందన పొంది రాసిన కవిత ఇది. ఆకవితను ఇక్కడ http://musingsbytrinath.blogspot.com/2007/12/paper-flower-suggested-by-prashanth.html